Saturday, September 19, 2020 By: visalakshi

ప్రార్థన - ఆర్తి...

 

 #ప్రార్థన*


పరకాయ ప్రవేశంతో రాజు దేహంలోకి ప్రవేశించిన శంకరాచార్యులు వారు చాలా కాలం వరకు తిరిగి రాకపోయే సరికి ఇంక రారు అని నిర్ణయించుకున్న శిష్యులు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించి కార్యం చేస్తారు శంకరాచార్యులు వారి దేహానికి నిప్పు పెట్టిన విషయం గ్రహించిన శంకరాచార్యులు వారు తిరిగి దేహంలోకి ప్రవేశించే సమయానికి దేహం దహనం అవుతుంది అని తెలుసుకుని నరసింహ స్వామిని ప్రార్ధిస్తారు. భక్తితో ఆర్తీతో చేసిన ప్రార్ధన ఆలకించిన స్వామి  శంకరాచార్యులు వారి దేహానికి పెట్టిన మంటలను చల్లార్చి రక్షిస్తాడు, అదే ఈ అద్భుతమైన శ్లోకం ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో అయినా అనారోగ్యంతో ఉన్నవారు అయినా ఈ స్త్రోత్ర పారాయణ చేసి వేడుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.


**శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రమ్**


1:: శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !

యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||


తా:: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.


2::బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత!

లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ || 


తా:: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన  స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.


3::సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |

వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా:: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.


4::సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |

ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ || 


తా::ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.


5::సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,

దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య  - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.


6::సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః !

ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి  కరావలమ్బమ్ ||


తా::దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది. ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ నరసింహస్వామీ కరావలంబన మొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము.


7::సంసార సర్ప ఘనవక్త్ర భాయోగ్ర తీవ్ర - దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :

నాగారి వాహన! సుదాబ్ది నివాస! శౌరే ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి  కరావలమ్బమ్ ||


తా::గరుడవాహనుడవు, పాలకడలి నివాసముగా కలవాడవు, అగు ఓ శౌరీ, సంసారము క్రూరమై, కోరలయందు విషము నిండి యున్న సర్పమువంటిది. దాని కాటువలన విషము శరీరము వ్యాపించి ప్రాణము పోవుచున్నది. నీవు నా ప్రాణములు కాపాడి నన్నుద్దరింపుము.


8::సంసార జాలపతిత స్య జగన్నివాస - సర్వేంద్రి యార్ధ బడి శాగ్ర ఝుషోపమస్య |

ప్రోత్ఖండిత ప్రాచుర తాలిక మస్తకస్య - లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్  ||


తా:::సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధ నుండి తొలగించి యుద్ధరింపుము.


9::సంసార వృక్ష మఘబీజ మనంత కర్మ- శాఖాయుతం కరణ పత్ర మనజ్గ పుష్పమ్ ||

ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్  ||


తా::సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రిందపడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.


10::సంసార దావద హనాతురభి కరోరు - జ్వాలావలీ భి రాతి దగ్ధ తనూరు హాస్య,

త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్  ||


తా::సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని. ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప తాపము నేదియు చల్లార్చజాలదు. ఓ నృసింహ దేవా! కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము.


11::సంసార సాగర నిమజ్జన ముహ్య మానం దీనం విలోకయ విభో! కరుణానిదే! మామ్|

ప్రహ్లాద భేద పరిహార పరావతారః లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.


12::సంసార యూద గజ సంహతి సింహదంష్ట్రా - భీత స్య దుష్ట మతి దైత్య భయంకరేణ |

ప్రాణ ప్రయాణ భవభీ తినివారణే న లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము ధరించి నాప్రాణములు కాపాడుమ


13::సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.


14::బద్ద్వాగళే యమ భటా హుతర్జయన్తః కర్షంతి యత్ర భవపాశశ తైర్యుతం మామ్ |

ఏకాకినం పరవశం చకితం దయాళో | లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::దయాళువైన ఓ పభూ! యమ భటులు పెక్కు పాశములతో నా మెడను బంధించి, బెదరించుచూ, ఏదారిలోనో నన్నీడ్చుకొని పోవుదురు. అపుడు పరులకు లొంగి, ఒంటరినై, దిగులుపడుచుండు నాకు దిక్కెవ్వరు? నీవే నాకు చేయూత నిచ్చి రక్షింపవలయును.


15::అన్దస్యమే హృత వివేక మహాధన స్య చొ రైర్మ హ బలిభి రిన్ద్రియ నామ దే యై:

మోహన్ద కారకుహరే వినిపాతిత స్య లక్ష్మీ నృసింహ!  మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము.


16::లక్ష్మీ పతే! కమలనాభ! సురేశ! విష్ణో ! యజ్ఞేశ ! యజ్ఞ! మధు సూదన! విశ్వరూప

బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ! లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా::ఓ లక్ష్మీ పతీ ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని  శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము.


17::ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసాది భాగవత పుంగవ వృన్నివాస|

భక్తా సురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా::ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. ఓ నరసింహస్వామీ, నాకు చేయూత నొసగి కాపాడుము.


18::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము.


19::ఆద్యన్త శూన్య మజమవ్యయ మప్రమేయ - షూదిత్య రుద్రా నిగమాది నుత ప్రభావమ్|

త్వామ్భోది జాన్య మధులోలుప మత్త భ్రుజ్గం - లక్ష్మీ నృసింహ !  మమ దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ దేవా! నీవు మొదలు, తుది లేనివాడవు, పుటకయు, నాశనమును లేనివాడవు ఇంతవాడని ఊహింప సాధ్యము సనివాడవు. వేదములు, సూర్యుడు, రుద్రుడు, మున్నగువారు నీ ప్రభావమును కీరించుచుందురు. నీవు లక్ష్మీ దేవి ముఖ పద్మము నందలి మధువు నందు ఆసక్తి గల కొదమ తుమ్మెదవు. నరసింహ స్వరూపుడవగు నీవు నాకు చేయూత నొసగి రక్షింపుము.


20::వారాహరామ నరసింహమాది కాన్తా - క్రీడా విలోల శూలి ప్రవన్ద్య

హంసాత్మకం పత్పరమ హంస విహార లీలం - లక్ష్మి నృసింహ! మమ  దేహి కరావలమ్బమ్ ||


తా::ఓ దేవా! నీవు వరాహ, వామన, నృసింహావ తారముల నెత్తినవాడవు. లక్ష్మీదేవి మున్నగు కాంతలతో క్రీడించుట యందు ఆసక్తి కలవాడవు. బ్రహ్మ, రుద్రాది దేవతలు నీ కేప్పుడునూ నమస్క రించుచుందురు. నీవు పరమహంస రూపుడవు. ఉత్తములగు యోగుల హృదయములందు విహరించుచుందువు. ఓ లక్ష్మీ నృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము.


21::ప్రహ్లాద మానస సరో జవిహార భ్రుజ్గ - గాజ్గ తర జ్గ ధవళాజ్గ రామా స్థితాజ్గ |

శ్రుజ్గర సజ్గర సకిరీట ల సద్వరాజ్గ - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా::ఓ నరసింహదేవా! నీవు ప్రహ్లాదుని మనస్సనెడు కమలమున విహరించు తుమ్మెదయైన వాడవు. గంగాతరంగములవలె తెల్లని దేహము కలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షః స్థలము కలవాడవు. శ్రుంగారము కలవాడవు. మేలైన కిరీటముతో ప్రకాశించు శిరస్శు కలవాడవు. నీవు నాకు చేయూత నిమ్ము.


22::మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |

విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ  దేహి కరవలమ్బమ్ || 


తా::నాకు నృసింహుడే తల్లి, నృసింహుడే తండ్రి, నృసింహుడే సోదరుడు, నృసింహుడే మిత్రుడు, నృసింహుడే విద్య, నృసింహుడే ధనము, నృసింహుడే ప్రభువు నాకు సమస్తమును ఆ నృసింహుడే !


23::శ్రీ శజ్కరార్యర చితం సతతం మనుష్యః - స్సోత్రం పటేది హతు సర్వగుణ ప్రసన్నమ్ |

సద్యో విముక్త కలుషో మునివర్య గన్యో - లక్ష్మీ నృసింహ ! మమ  దేహి కరవలమ్బమ్ ||


తా::సమస్త గుణములతో కూడి, శంకర భాగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పటించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంటమును పొందును.


24::యన్మాయార్జిత భవ ప్రచుర ప్రవాహా - మగ్నార్త మర్త్యనివ హేషు కరావలమ్బమ్,

లక్ష్మీ నృసింహ చరనాబ్జ మధువ్రతేనా - లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్ ||


తా::మాయా ప్రభావమున అజ్ఞానమునందు పడి, పెక్కు జన్మములను పొందుచూ, బాధల ననుభవించుచూ మనుష్యులకు ఈ స్తోత్రము తరించుటకు చేయూత అయినది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు తుమ్మెద వంటి వారగు శ్రీ శంకరాచార్యులు రచించిరి.


25::శ్రీమాన్న్రుసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్ర యో పశామనాయ భావౌషదాయ |

త్రుష్ణారి వృశ్చిక జలాగ్నిభుజ జ్గరోగ - లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||


తా::ఓ లక్ష్మీ నరసింహస్వామీ ! నీవు సమస్త లోకములకు ప్రభువువు. గరుడధ్వజుడవు. తాపత్రయమును నశింపజేయువాడవు. సంసారములనెడి రోగములకు ఓషదము వంటివాడవు. ఆకలి దప్పులు, తేళ్ళు, అగ్ని, జలము, పాములు, రోగములు మున్నగు వానివలన కలుగు బాధలను నశింపజేయువాడవు. పాపములు హరించు వాడవు. గురువైన వాడవు. అట్టి నీకివే మా నమస్కారములు.


#ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్*

#దేవాలయాలకు వెళ్లవలెనా ?


{శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహ భాషణములనుండి}


దైవారాధనకు చాలా పద్ధతులున్నాయి. మానసిక పరిపక్వత కల్గినవారు ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని మానసికమైన ధ్యానం చేసుకోగలరు. మనస్సును నియంత్రణ చేయలేనివారు దేవాలయంలో వలెనే తమ ఇండ్లలో విగ్రహాలు పెట్టుకొని మంత్ర పఠనంతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. తమ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహించటానికి అవకాశం లేనివారు ఆలయాలకు వెళ్లి అక్కడ ఈ విధులను నిర్వర్తించి భగవదనుగ్రహాన్ని పొందుతారు.


మానవుని దుఃఖాల్ని ఉపశమింప చేయగల దివ్యౌషధం పరమాత్ముని యందు మనంలగ్నం చేసే స్థిరమైన భక్తి విశ్వాసాలే. మన బాధల్ని అధిగమించటానికి ఆవశ్యకమైన దార్ధ్యతను భక్తి సమకూరుస్తుంది. అలాంటి భక్తిని పెంచి పోషించే నిలయాలే ఆలయాలు. ఈ లక్ష్యంతోనే దేవాలయాలు నిర్మింపబడుతున్నాయి.

భగవంతుని తమ గృహాల్లో ఆరాధించేవారు దేవాలయాలకు వెళ్లవలెనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ”అవును. వెళ్లాల్సిందే” అనేదే దానికి సమాధానం. ప్రతివాడు సాయంత్రం 6-30 గం.లకు అనగా ప్రదోషకాలంలో దేవాలయానికి వెళ్లి దైవదర్శనం తప్పని సరిగా చేసుకోవాలనేది మన మతం మనకిచ్చే ప్రత్యేక ఆదేశం. దేవాలయంలోని దేవత నారాధించుటను మనం ఒక ఆజ్ఞగా శిరసావహించాలి.


సర్వవ్యాపకుడైన దైవాన్ని ఆరాధించటానికి దేవాలయాల్లోకే వెళ్లాలా అని వేదాంతులు, పండితులు అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. పరమాత్ముని ప్రతి వస్తువులోను చూడగల ఉచ్చస్థితికి మనం రాగల్గితే నిశ్చయంగా మనం ఆలయ దర్శనం చేయనవసరం లేదు. కాని మనం మన చేతులకున్న కాలుష్యాన్ని దేవాలయ గోడలపై రుద్ది ఆ గోడల్ని కలుషితం చేసే సమయంలో గోడల్లో దేవుని ఉనికిని భావిస్తామా? ఆ సందర్భంలో భగవానుడు గర్భగుడిలో మాత్రమే వుంటాడని తలుస్తాం. అలా భావించటం కూడ మంచిదే. అలాంటి విశ్వాసంతో దైవదర్శనం చేసికొని, ధ్యానించి దేవునిపై భక్తిని పెంపొందించుకొని భగవానుని సర్వవ్యాపకత్వాన్ని గురించి ఆలోచించే స్థాయికి చేరుకోగల్గుతారు. ఇలా దైవభక్తితో బహుసంఖ్యలో ఆలయాల్లో సమావేశమయ్యే ఆచారం మొత్తం దేశానికే శ్రేయోదాయకం.


మనం ఆలయాల్లో చేసే దైవారాధన మనగోత్ర నామాలు, జన్మనక్షత్రం మొదలైనవి చెప్పింతర్వాత ప్రారంభింప బడుతుంది. ప్రతివాడు తన యోగక్షేమం కొరకే దైవప్రార్థన చేస్తాడు. కనీసం తన కుటుంబ శ్రేయస్సును కూడ అర్థించడు. కాని మానసిక ధ్యానం చేసేవారు మాత్రం నిష్కామంగా ధ్యానజపం ఆచరిస్తారు. ప్రత్యేకమైన శ్రేయస్సులను తాము, తమ కుటుంబం సాధించుకోటానికి ప్రత్యేకమైన పూజావిధానాలున్నాయి.


ప్రతిదేవాలయంలోను నిత్యపూజలుంటాయి. అవి నిర్వర్తించిన తర్వాతే వ్యక్తులు తమ శ్రేయస్సుకోరి తమ గోత్రనామాలతో చేయించే పూజలు, అభిషేకాలు నిర్వహింపబడతాయి. ఇవిగాక సమాజ శ్రేయస్సు లక్ష్యంగా చేసే పూజలు కూడ ఉంటాయి. వీటిని పరార్థ పూజలంటాం. దేవాలయాలు దేశం మొత్తం ప్రజల శ్రేయస్సు కొరకు ఉద్దేశింపబడినవే. అచ్చట అందరు సమానులే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా అనే భావనకు అవకాశం లేదు. దేవాలయ కార్యక్రమ నిర్వహణలో అందరకు బాధ్యత ఉంది. ప్రతి ఆలయానికి ఒక సేవాసంఘం లేక సేవాసమితి ఉండవచ్చు. కాని దానికి ప్రత్యేక అధికారాలుగాని, హక్కులు గాని ఉండవు. కనుక ప్రజలందరు సమాన హక్కులను అనుభవిస్తూ, సేవానిరతిలో దేవాలయ కార్యక్రమాల్ని జయప్రదం చేయటానికి పూనుకోవాలి.


విగ్రహానికి పూజలు చేసేటప్పుడు ఔపచారిక క్రియలు చాలా నిర్వహిస్తాం. ఇంత క్రియాకలాపంతో కూడిన ఆరాధనను మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఎవరైనా అడగవచ్చు. కేవలం ప్రార్థన చేస్తే చాలదా ? దానికి సమాధానం లేకపోలేదు. మనం అనుభవించే ప్రతి వస్తువు భగవత్ప్రసాదితమే అనే భావనతో కృతజ్ఞతా పూర్వకంగా ఆయనకు ప్రీతియైన పదార్థాలను ఆయనకు నివేదించుంటే ఈ క్రియాకలాపాల అంతరార్థం.

అంతేగాక ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి వస్తువునకు ఆధారభూతుడు భగవానుడే. వానిని నమ్రతతో ఆయన పాదాలవద్ద సమర్పించి తిరిగి వాటిని స్వీకరిస్తే మన ఆపదలన్నీ పటాపంచలౌతాయి. ఈప్సితార్థాలన్నీ నెరవేరుతాయి. ఆయన కరుణా కటాక్షానికి పాత్రులమయ్యామనే ఆనందం మనకు దక్కుతుంది. భగవంతునకు మనం చేసే అర్పణల వెనుకనున్న ఆంతరంగిక భావన ఇదే.

(From FB)....


0 comments: