Sunday, March 15, 2009 By: visalakshi

జవాబు లేని ప్రశ్న

తదేక ఆలోచనలో నిమగ్నమైన వైష్ణవి పిల్లల పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది.
తన పరధ్యానాన్ని తిట్టుకుంటూ వారికి కావలసినవన్నీ సమకూర్చింది.ఇంతకీ ఆమె ఆలోచించే విషయం మొన్నకనిపించిన తన స్నేహితురాలి గురించే.
* * * * * * * *
వైష్ణవి, భవ్య ఇద్దరూ 8వ తరగతి నుండీ స్నేహితురాళ్ళు. వైష్ణవి విరిసీ విరియని గులాబీలా ఉండేది.
భవ్య సన్నగా తెల్లగా పాలిపోయిన ముఖంతో ఉండేది.భవ్య, వైష్ణవి కన్నా 2ఏళ్ళు పెద్దది.బహుశా భవ్య ఆలస్యంగా స్కూలులో చేరి ఉంటుంది.
వైష్ణవి ఇంటికి ఫర్లాంగు దూరంలో భవ్య ఇల్లు ఉంటుంది.ఒకసారి ఏం జరిగిందంటే..........
8వ తరగతిలో ఇద్దరూ పక్క పక్కన కూర్చునేవారు.వెనకాల బెంచిలోవాళ్ళు మాట్లాడిస్తే వీళ్ళు వెనక్కితిరిగితే టీచరుకి కోపం వచ్చి వీళ్ళిద్దరినీ విడి,విడిగా కూర్చోబెట్టింది. అప్పుడు భవ్య ఆ రోజూ,మరుసటి రోజూ ఏడుస్తూనే ఉంది.నేను వైష్ణవి పక్కనే కూర్చుంటాను లేకపోతే స్కూలు మానేస్తాను అని
దాంతో టీచరు మరల ఇద్దరినీ ఒక చోట కూర్చోబెట్టింది.అంత ఇష్టం భవ్యకి, వైష్ణవి అంటే.
10వ తరగతి లో ఉండగా ఎదురింటి అబ్బాయితో ప్రేమలో పడింది భవ్య.అంతకు ముందు వాళ్ళ బావను ఇష్టపడ్డా వాళ్ళు కాదని అనేసరికి ఊరుకుంది. ఎదురింటి అబ్బాయితో గుడికి, పార్కుకి వెళ్ళేది కానీ వైష్ణవికి తెలియదు,చెప్పలేదు.ఎప్పుడైతే సడన్ గా ఆ అబ్బాయి పెళ్ళి చేసుకొచ్చాడో, అప్పుడు షాక్ తింది .4 రోజులు మనిషి కాలేదు.వైష్ణవి ఎందుకలా ఉన్నావు అని నిలదీస్తే అప్పుడు బయట పెట్టింది విషయం. ఆ అబ్బాయి వైష్ణవికి తెలుసు.వాళ్ళ అక్క అంటే చాలా అభిమానం వైష్ణవికి. ఆమె చాలా అందంగాఉండేదని అనుకునేది .వాళ్ళ తమ్ముడు అలా చేసాడంటే నమ్మశక్యం కాలేదు వైష్ణవికి.ఇంతకీ తేలిన విషయమేమంటే భవ్య దగ్గర ఎలా ప్రవర్తించాడో అంతకంటే దారుణంగా చేసుకున్న ఆమె దగ్గర కూడా అలాగే వంచించ బోతే వాళ్ళ పెద్ద వాళ్ళు దేహ శుధ్ధి చేసి పెళ్ళి చేసారు.అని.అలా ప్రేమాయణానికి తెర పడ్డాక మరల చదువులో పడింది భవ్య.అప్పుడే ఓ భీష్మ ప్రతిజ్ఞ చేసింది. "ఈ ప్రపంచంలో ఒక్కరు తప్ప అందరూ నాకు సోదర సమానులే "అంటూ.అలా కనపడినప్రతివారిని అన్నయ్యా అనేది బస్సు డ్రైవరుని డ్రైవరన్నయ్యా ,కండక్టర్ని కండక్టరన్నాయ్యాని పిలిచేది. పక్కనున్న వైష్ణవికి ఏమనాలో నవ్వాలో ఏడవాలో అర్ధమయ్యేది కాదు.(ఇదంతా ఇంటరుకాలేజీకి వెళుతున్నప్పుడు)
ఇంటరు పూర్తయ్యేసరికి వైష్ణవికి చదువు మీద అశ్రధ్ధా; తెలిసిన అబ్బాయిని ఇష్టపడుతూ అతనితో తిరగడం,స్నేహితురాలి అండతో పెళ్ళి ఐయిపోయింది.భవ్య పాలిటెక్నిక్ చేసి,వాళ్ళ నాన్న గారి ద్వారా గవర్నమెంట్ .జాబు సంపాదించింది.
వైష్ణవి ఇద్దరు పిల్లలతో సందడిగా ఉన్నప్పుడు భవ్య వచ్చింది,వాళ్ళింటికి. అదేసన్నం 5ఏళ్ళు ఐనా మనిషి మారలేదు ముఖం మాత్రం ముసలి తనం వచ్చినట్టుగా ఉంది.కానీ తన ఫీలింగు మాత్రం చాలా అందంగా ఉన్నానని.ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టుగా ,జుట్టంతా తెల్ల మెరుపు,పాలిన ముఖం అయినా తనంటే చాలామందికి క్రేజ్ అన్నట్టుగా ఉండేది ఆమె నడవడిక. వాళ్ళ నాన్నగారు పెళ్ళి సంబంధాలు చూసి,చూసి చివరికి ఒక సంబంధం కుదిర్చారు.అబ్బాయికి అమ్మా నాన్న లేరు,అమ్మమ్మ దగ్గర పెరిగాడు.మొత్తానికి పెళ్ళి అయింది. వైష్ణవి పెళ్ళికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళింది.ఇక పెళ్ళైనప్పటినుండి భార్యా,భర్తలిద్దరూ కలిసి జీవించింది వేళ్ళతో లెక్కపెట్టచ్చు.భవ్యకి ఒక చోట జాబ్ ఐతే అతనికి వేరొక చోట జాబ్.వారికి పెళ్ళై ఇప్పటికి 15 ఏళ్ళు. ఈ పదిహేనేళ్ళు వాళ్ళు నిరాశ, నిస్ఫృహల మధ్యే గడిపారు.
ఇద్దరు మగ పిల్లలు వాళ్ళకి .ఐనా ఇద్దరూ పైసా తీయాలంటే దడుస్తారు.ఎంతో పొదుపుగా, మరెంతో ఒంటరిగాఅ భార్యా, భర్తా మరియు పిల్లలని ఇప్పటికీ చూసి వైష్ణవి అనుకుంటూ ఉంటుంది.
"వీళ్ళెప్పటికీ మారరా! వ్యక్తిగత ఆనందం అక్కరలేదా వీళ్ళకి;ఎంతసేపూ ధనార్జనా,యాంత్రికంగా గడిపేయడమేనా! ఆ పిల్లలు కూడా భవిష్యత్ లో అలాగే ఉంటారా.......తన స్నేహితురాలిని ఎప్పుడు చూసినా మనసులో కదలాడే ఈ ప్రశ్నలకి వైష్ణవి దగ్గరా జవాబు లేదేమో!"

2 comments:

పరిమళం said...

ప్చ్ ....కొన్ని జీవితాలంతేనండీ ....వారేం కోల్పోయారో వారికెప్పటికీ తెలీకుండానే జీవితం అయిపోతుంది .

Ramani Rao said...

కథ బాగుంది అంత నిరాశ నిపృహల మధ్య అలా ఎలా బతుకుతారో కదా.. అలా తన చుట్టు గిరి గీసుకొని ఉన్నవాళ్ళకి తను తప్ప ఇంకెవరూ సంతోషంగా ఉండరు అన్న భావన ఉంటుందిట. ఆ భావన అనే భ్రమలో వాళ్ళు ఆనందంగా జీవించేస్తారు. సో, అక్కా రాయడం శుభారంభం బాగుంది. కథలు మొదలు పెట్టేయి బాగా రాస్తున్నావు. రాయడం శుభారంభం బాగుంది.